న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కొవిడ్ సోకితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి ప్రస్తుతం పల్స్ ఆక్సీమీటర్లను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే, అసలు ఆక్సిజన్ స్థాయే పడిపోకుండా ఉండాలంటే.. ఊపిరితిత్తుల పనితీరు బాగుండాలి. మరి మన ఊపిరితిత్తులు బాగానే పని చేస్తున్నాయా? లేదా? అని తెలుసుకోవటం ఎలా? ‘ఆరు నిమిషాల నడక’ పరీక్ష ద్వారా దీనిని తెలుసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ఆరోగ్య విభాగం కూడా రాష్ట్ర ప్రజలకు ఇదే సూచన చేసింది. కొల్హాపూర్లో ఆరోగ్య అధికారులు హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ఈ పరీక్షను తప్పనిసరి చేశారు. రోజూ కనీసం రెండు సార్లు నడవాలని సూచించారు.
ఆరు నిమిషాల నడక పరీక్ష ఏమిటి?
మొదట పల్స్ ఆక్సీమీటర్లో ఆక్సిజన్ స్థాయిని చెక్ చేస్కోవాలి. తర్వాత 6 నిమిషాలు ఆగకుండా నడవాలి. ఇప్పుడు ఆక్సిజన్ స్థాయిని మళ్లీ చెక్ చేసుకోవాలి. నడవడానికి ముందు, తర్వాత శరీరంలో ఆక్సిజన్ స్థాయిలో 4 కంటే ఎక్కువ పాయింట్లు తేడా వచ్చినా, లేదా ఆక్సిజన్ స్థాయి పల్స్ ఆక్సీమీటర్లో 94 కంటే దిగువకు పడిపోయినా శరీరంలో తగినంత ఆక్సిజన్ లేదని, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ పరీక్షను రోజూ 3 సార్లు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.