న్యూఢిల్లీ, జనవరి 25: విధి నిర్వహణలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వీరులకు భారత ప్రభుత్వం 80 శౌర్య అవార్డులను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటికి ఆమోదం తెలిపారు. వీరిలో ఆరుగురిని కీర్తి చక్ర, 16 మందిని శౌర్యచక్ర అవార్డులకు ఎంపిక చేశారు. కీర్తి చక్రలో ముగ్గురికి, శౌర్య చక్రలో ఇద్దరికి మరణాంతరం అవార్డులను ప్రకటించారు. అశోకచక్ర తర్వాత రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర కాగా, మూడోది శౌర్య చక్ర.
కీర్తిచక్ర: కీర్తి చక్ర అవార్డు పొందిన వారిలో ప్యారాచూట్ రెజిమెంట్ 21వ బెటాలియన్కు చెందిన దిగ్విజయ్ సింగ్ రావత్, సిక్కు రెజిమెంట్ నాలుగో బెటాలియన్కు చెందిన మేజర్ దీపేంద్ర విక్రమ్ బాస్నెట్, మహర్ రెజిమెంట్ 21వ బెటాలియన్కు చెందిన హవల్దార్ పవన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే మరణాంతరం ఈ అవార్డు పొందిన వారిలో కెప్టెన్ అన్షుమన్ సింగ్, హవల్దార్ అబ్దుల్ మజీద్, సిపాయి పవన్ కుమార్ ఉన్నారు.
శౌర్య చక్ర: శౌర్య చక్ర అవార్డు పొందిన వారిలో మేజర్ మనియో ఫ్రాన్సిస్, మేజర్ అమర్ దీప్ జక్కర్, నాయిబ్ సుబేదార్ బరియా సంజయ్ కుమార్ భామర్ సింగ్, హవల్దార్ సంజయ్ కుమార్, పర్షోత్తమ్ కుమార్, బిమల్ రంజన్ బెహ్రా, శైలేష్ సింగ్, హృషికేశ్ జయన్ కరుతేదత్, బిబ్హర్ కుమార్ సింగ్, మోహన్ లాల్, అమిత్ రైనా, ఫరోజ్ అహ్మద్ దార్, వరుణ్ సింగ్ ఉన్నారు. మరణాంతరం శౌర్యచక్ర లభించిన వారిలో కెప్టెన్ ఎంవీ ప్రాంజల్, అలోక్ రావు ఉన్నారు. అలాగే 53 సేనా పతకాలు (ఏడుగురికి మరణాంతరం), ఒక నానో సేనా పతకం, నాలుగు వాయుసేన పతకాలు కూడా ప్రకటించారు.
1,132 మందికి పోలీస్ పతకాలు
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్రం పోలీస్ పతకాలను ప్రకటించింది. 1,132 మందికి శౌర్య, సేవా పతకాలను అందజేయనుంది. పోలీసు, అగ్నిమాపక దళం, హోం గార్డ్స్, సివిల్ డిఫెన్స్, కరక్షనల్ సర్వీస్లలో పని చేస్తున్నవారికి ఈ పతకాలు లభించాయి. తెలంగాణ నుంచి 22 మందికి పతకాలు దక్కాయి.