బాలాసోర్ : ఒడిశాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బొగ్గు లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడాదిన్నర చిన్నారితో సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాలాసోర్ జిల్లా ఉడాలా నుంచి భువనేశ్వర్కు బస్ వెళ్తుండగా.. సోరోలోని బిదుచౌక్ వద్ద బస్ను బొగ్గు లోడ్తో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా దెబ్బతిన్నది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కొంతమంది గ్రామస్తులు, వాహనదారుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. గాయపడ్డ వారందరినీ సోరో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.