భారత్ నుంచి అమెరికాకు వెళ్లే నాలుగు విమాన సర్వీసులను బుధవారం ఎయిరిండియా రద్దు చేసింది. అమెరికాలో 5జీ సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఒక్క ఎయిరిండియానే కాదు ఎమిరేట్స్, నిప్పాన్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్లైన్స్, ఐరోపాకు చెందిన ఎయిర్బస్ తదితర సంస్థలు కూడా తమ వేలాది విమాన సర్వీసులను రద్దు చేసుకొన్నాయి. దీంతో అమెరికా నుంచి ఇండియా సహా ఇతర దేశాలకు ప్రయాణాలకు ప్లాన్ చేసుకొన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 36 గంటల్లో అగ్రరాజ్యంలో విమానయాన సంక్షోభం ఏర్పడే ప్రమాదమున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏమిటి సమస్య?
అమెరికన్ల మొబైల్ ఫోన్లకు 5జీ సేవలు అందించే క్రమంలో ఏటీ అండ్ టీ, వెరిజోన్ టెలికం సంస్థలు 2021లో రూ. 5.95 లక్షల కోట్లు వెచ్చించి 3.7-3.98 గిగా హెర్ట్ పరిధిలో 5జీ సీ-బ్యాండ్ ఫ్రీక్వెన్సీని కొనుగోలు చేశాయి. బుధవారం నుంచి సేవలను ప్రారంభించాలని నిర్ణయించాయి. అయితే, 5జీ సర్వీసులతో విమానాలకు ముప్పు పొంచి ఉన్నదని, విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని విమానయాన సంస్థలు ఆరోపిస్తున్నాయి. 5జీ సేవలను నిలిపేయాలని కోరుతున్నాయి.
విమానాలకు ముప్పు పొంచి ఉందా?
ఎయిర్ట్రాఫిక్, విమానాశ్రయ పరిసరాల్లో భారీగా పొగమంచు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల పైలట్లు ‘లో విజిబిలిటీ’ సమస్యను ఎదుర్కొంటారు. అయితే, విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి కాక్పిట్లో ‘రాడార్ అల్టీమీటర్’ అనే ప్రత్యేక సాధనం ఉంటుంది. ఈ పరికరం సాయంతో నేలపై నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఎంత ఎత్తులో ఉన్నది? ఎంత వేగంతో విమానం కిందకు వాలుగా దిగుతున్నది? గాలి ప్రవాహం ఎంత వేగంగా ఉన్నది? తదితర వివరాలను పైలట్ తెలుసుకోవచ్చు. ఈ రాడార్ అల్టీమీటర్ డివైజ్ 4.2-4.4 గిగా హెర్ట్ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది. అమెరికాలో ప్రస్తుతం తీసుకొస్తున్న 5జీ సర్వీసులు 3.7-3.98 గిగా హెర్ట్ ఫ్రీక్వెన్సీ పరిధిలోనే ప్రసారం చేయబోతున్నారు. దీంతో ‘రాడార్ అల్టీమీటర్’ ఫ్రీక్వెన్సీ, 5జీ నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అత్యంత దగ్గరగా ఉండటంతో ఫ్లైట్ సిగ్నళ్లలో అంతరాయం కలుగుతుందని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అల్టీమీటర్ సిగ్నల్స్లో అంతరాయం ఏర్పడితే విమానం కూలిపోయి ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని భయపడుతున్నాయి.
మిగతా దేశాల్లో సమస్య రాలేదా?
ఐరోపా సమాఖ్య (ఈయూ)లో 2019లోనే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అక్కడ 5జీ సేవలకు 3.4-3.8 గిగాహెర్ట్ ఫ్రీక్వెన్సీని (అమెరికాతో పోలిస్తే తక్కువ ఫ్రీక్వెన్సీ) వినియోగించారు. ఫ్రాన్స్లో 3.6-3.8 గిగాహెర్ట్, దక్షిణ కొరియాలో 3.42-3.7 గిగాహెర్ట్ ఫ్రీక్వెన్సీతో ఇప్పటికే 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అల్టీమీటర్ డివైజ్ ఫ్రీక్వెన్సీకి ఈ పౌనఃపున్యాల రేంజ్కు మధ్య ఎడం కొంచెం ఎక్కువగా ఉండటంతో అక్కడ విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలుగడం లేదు. పైగా ఎయిర్పోర్ట్స్ పరిసరాల్లో 5జీ సేవలను ఆయా దేశాల్లో నిలిపేశారు. దీంతో సమస్య తలెత్తలేదు.
మన దేశంలో?
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కరోనా సంక్షోభం, స్పెక్ట్రమ్ ధరల్లో సవరణలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 5జీ స్పెక్ట్రమ్ కొత్త ధరలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మార్చి నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ (డాట్)కు సమర్పించనున్నట్టు సమాచారం. తర్వాత స్పెక్ట్రమ్ వేలం మొదలవుతుంది. జూలైలో ఈ వేలం ప్రక్రియ ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ‘రాడార్ అల్టీమీటర్’ సిగ్నళ్లకు అంతరాయం కలిగించని 5జీ రేంజ్ స్పెక్ట్రమ్ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరిష్కారం ఏమిటి?
సమస్య పరిష్కారం కావాలంటే 5జీ సేవల ఫ్రీక్వెన్సీ రేంజ్ను తగ్గించాలని.. దీనికోసం సేవల అమలును మరికొన్ని రోజులు వాయిదా వేయాలని అమెరికా విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ల సమీపంలో 5జీ సర్వీసులను ప్రసారం చేయకూడదని పేర్కొంటున్నాయి.