న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రస్తుతమున్న సుంకాలను ట్రంప్ ప్రభుత్వం రెట్టింపు చేయడంతో బుధవారం(ఆగస్టు 27) నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం పడనున్నది. ఇది ఎగుమతిదారులపై మోయలేని భారాన్ని వేయనున్నది. అమెరికా విధించిన భారీ సుంకాలు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారుల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) మంగళవారం ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వస్తే వ్యవసాయం, ఫార్మా, జౌళి, చర్మ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎగుమతులపైనే ఆధారపడిన పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈలు)లపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ వ్యూహమని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగే సమావేశంలో ఎగుమతిదారులకు ఎలాంటి భరోసా కల్పించాలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.