లక్నో: ఒక యువకుడు కరోనాతో చనిపోయాడు. అయితే చికిత్స అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల అతడు మరణించినట్లు యువకుడి కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 2021లో దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్లో ఘజియాబాద్కు చెందిన 20 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడ్ని నోయిడాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. నెలన్నర రోజుల తర్వాత ఆసుపత్రి చికిత్సా విధానంపై అసంతృప్తితో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు.
కాగా, ఆ యవకుడి మరణానికి నోయిడా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆ కుటుంబం ఆరోపించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రిమెడిసివిర్ ఇంజెక్షన్ను ఆసుపత్రిలో తాము కొనుగోలు చేసినప్పటికీ అతడికి ఇవ్వలేదని తెలిపింది. చికిత్సలో వైద్యల నిర్లక్ష్యం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తికం సింగ్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన నేతృత్వంలోని కమిటీ దీనిపై దర్యాప్తు జరిపింది. బాధిత కుటుంబం ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద ఫేజ్ 2 పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మరోవైపు తమ ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. యువకుడికి చికిత్స అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని యథార్థ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ త్యాగి తెలిపారు. కరోనా సోకిన యువకుడిని క్రిటికల్ కండీషన్లో తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని, అర గంట ఆలస్యం అయినా అతడు బతికేవాడు కాదన్నారు. యువకుడి పరిస్థితి మెరుగవుతుండగా 35 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో తమ వైద్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించారని కపిల్ త్యాగి తెలిపారు. రిమెడిసివిర్ ఇంజెక్షన్ వల్ల కరోనా చికిత్సపై ఎలాంటి ప్రభావం ఉండదని పలు పరిశోధనల్లో తేలిందన్నారు. యువకుడ్ని ఆ కుటుంబం కోల్పోవడం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.