(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): బెంగాల్లోని మమత సర్కారుకు కలకత్తా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. 2012లో బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన వెనుకబడిన తరగతుల చట్టం కింద జారీచేసిన ఈ ధ్రువపత్రాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా కోర్టు అభిప్రాయపడింది.
అయితే ఇప్పటికే ఈ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినవారిపైనా, ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఉన్నవారిపైనా ఈ తీర్పు ప్రభావం ఉండదని వివరించింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించేలా వారు (బీజేపీ) ఈ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. దీనిని అంగీకరించేది లేదని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు.