రాయ్పూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా ( Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో గత ఐదు రోజులుగా పవర్ కట్ నెలకొన్నది.
కాగా, శుక్రవారం సాయంత్రం కిలేపాల్లో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా 18 మంది గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసినప్పటికీ అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి సమీపంలో నివసిస్తున్న చిత్రకూట్ ఎమ్మెల్యే రాజ్మాన్ బెంజమిన్, బస్తనార్ తహసీల్దార్ తమ వాహనాల్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కరెంట్ లేకపోవడంతో గాయపడిన వారికి మొబైల్ టార్చ్లైట్ వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు.
మరోవైపు కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం దిమరాపాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. దీంతో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా ఆసుపత్రికి విద్యుత్ సరఫరా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.