న్యూఢిల్లీ: దేశంలో రోజుకు 47.40 లక్షల 14.2 కేజీ ఎల్పీజీ సిలిండర్లు వినియోగమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవాళ దేశంలో గ్యాస్ వినియోగానికి సంబంధించి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం అండ్ నాచ్యురల్ గ్యాస్ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 14.2 కేజీ సిలిండర్లు రోజుకు 47.40 లక్షల చొప్పున, 19 కేజీ సిలిండర్లు రోజుకు 2.9 లక్షల చొప్పున వినియోగమయ్యాయని పేర్కొన్నారు.
కేంద్ర పెట్రలోలియం, సహజవాయు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా చేసిన తాజా ప్రకటన ప్రకారం.. డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ సిలిండర్ల ధరలు నెలనెల వేర్వేరుగా ఉన్నాయి. రిటెయిల్ సెల్లింగ్ ప్రైజ్, అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లలో ధరలు ఇందుకు కారణంగా తెలిపింది. ఇదిలావుంటే ప్రభుత్వం కూడా డొమెస్టిక్ సిలిండర్లపై 5 శాతం, నాన్ డొమెస్టిక్ సిలిండర్లపైన 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్నది.