న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నగరంలో కుంభవృష్టి పడింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో మొదలైన వాన మధ్యాహ్నం 2.30 గంటల దాకా ఏకధారగా కురిసింది. రహదారులన్నీ నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించింది. అండర్పాస్లలో నీళ్లు భారీగా నిలిచిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు మునిగిపోయాయి. పాలం ఫ్లై ఓవర్ వద్ద అండర్ పాస్లో 40 మందితో ఉన్న బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. అగ్నిమాపక దళం వారిని రక్షించింది. మరో చోట కూడా 18 మంది ప్రయాణికులు రెండు వాహనాల్లో చిక్కుకుపోయారు. వారిని కూడా కాపాడారు. ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులోకి భారీగా వరదనీరు చేరింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. రన్వేలు, ఎయిర్పోర్టు సమీపంలోని హోటళ్లు నీటిలో చిక్కుకొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మూడు విమానాలు రద్దు అయ్యాయి. ఐదింటిని దారి మళ్లించారు. ఇదిలా ఉండగా, ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలో వచ్చే మూడు నాలుగురోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
అనూహ్య వర్షపాతం
ఢిల్లీలో ఈ ఏడాది అనూహ్య వర్షపాతం నమోదైంది. నైరుతిలో గత 46 ఏండ్లలో పడనంత వాన కురిసింది. మొత్తం 110 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1975లో నైరుతిలో కురిసిన 115 సెంటీమీటర్ల తర్వాత ఇదే అత్యధికం. సాధారణంగా ఢిల్లీలో ప్రతీ ఏడాది నైరుతిలో సగటున 65 సెంటీమీటర్ల వాన పడుతుంది. అంటే ఈ ఏడాది సగటు కంటే రెట్టింపు వర్షపాతం నమోదైందన్నమాట.