న్యూఢిల్లీ: వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి లా కమిషన్కు 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. వీటిపై ఆయా మతాలు, వర్గాల వారితో లా కమిషన్ చర్చించనున్నదని కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఐద్వా (ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమెన్స్ అసోసియేషన్) లా కమిషన్కు లేఖ రాసింది. మహిళల పట్ల వివక్షను రూపుమాపటంలో, సమాన హక్కులు కల్పించటంలో యూసీసీ ఉపయోగం లేదని పేర్కొంది. యూసీసీపై అభిప్రాయాలు తెలపడానికి మరో రెండు రోజుల సమయం ఉంది.