న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 46 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 45 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కరోనా వల్ల 4,37,830 మంది బాధితులు మరణించారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 35,840 మంది కరోనా నుంచి బయటపడ్డారని, మరో 460 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.53 శాతంగా ఉందని తెలిపింది.
కాగా, కేరళలో కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో రికార్డయిన 45 వేల పాజిటివ్ కేసుల్లో ఒక్క కేరళలోనే 31,265 ఉండటం గమనార్హం. వైరస్ వల్ల రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 153 మంది మరణించారు. అంటే కొత్త కేసులు, మరణాల్లో అత్యధికశాతం వాటా ఆ రాష్ట్రంలోనే ఉండటం విశేషం.
కరోనా మూడో వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా శనివారం 17,55,327 మందికి పరీక్షలు చేశారు. దీంతో ఆగస్టు 28 నాటికి మొత్తం 51,86,42,929 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది.