న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 88 దేశాల్లో 4,355 మంది భారతీయులు కరోనాతో మరణించారు. సౌదీ అరేబియా, యూఏఈలో అత్యధికంగా భారతీయులు వైరస్ వల్ల చనిపోయారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు గురువారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కరోనా సోకిన భారతీయుల్లో సౌదీ అరేబియాలో గరిష్ఠంగా 1,237 మంది, యూఏఈలో 894 మంది మరణించినట్లు తెలిపారు. ఈ రెండు దేశాల్లో 60 లక్షల మందికిపైగా భారతీయులు నివసిస్తున్నట్లు చెప్పారు.
కువైట్లో 668 మంది, ఒమన్లో 555 మంది, బహ్రెయిన్లో 203 మంది, మలేషియాలో 186 మంది, ఖతార్లో 113 మంది భారతీయులు కరోనాతో మరణించినట్లు కేంద్ర మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. అంత్యక్రియల కోసం 127 మంది భారతీయుల మృతదేహాలను భారత్కు తీసుకువచ్చినట్లు చెప్పారు. దీని కోసం ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. మృతదేహాలను భారతదేశానికి తరలించడానికి లేదా స్థానికంగా ఖననం చేయడానికి భారతీయ కమ్యూనిటీ సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. విదేశాల్లోని రాయబార కార్యాలయాలకు ఈ మేరకు అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు.
మరోవైపు కరోనా కాలంలో ఆరు పశ్చిమాసియా దేశాల నుంచి 716,662 మంది భారతీయులు ప్రత్యేక స్వదేశీ విమానాలలో తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. యూఏఈ నుంచి 3,30,058 మంది, సౌదీ అరేబియా నుంచి 1,37,900 మంది, కువైట్ నుంచి 97,802 మంది, ఒమన్ నుంచి 72,259 మంది, ఖతార్ నుంచి 51,190 మంది, బహ్రెయిన్ నుంచి 27,453 మంది తిరిగి భారత్కు చేరుకున్నట్లు చెప్పారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు.