న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 37 వేల కేసులు నమోదవగా, తాజాగా 43 వేల పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో బుధవారం 30,196 కేసులు నమోదవగా, 181 మంది మృతిచెందారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,39,981కు చేరింది. ఇందులో 3,93,614 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,41,749 మంది బాధితులు మృతిచెందారు. మరో 3,23,04,618 మంది కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 338 మంది మరణించగా, 40,567 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు.
దేశంలో మొత్తం 71,65,97,428 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో గత 24 గంటల్లో పంపిణీ చేసిన 86,51,701 డోసులు కూడా ఉన్నాయని తెలిపింది.