లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో కరోనా వైరస్ కోరలు చాచింది. 40 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ పూరి కూడా ఉన్నారు. విశేషమేంటంటే.. వీరంతా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
కరోనా సోకిన వారిలో 20 మంది సర్జరీ డిపార్ట్మెంట్, 9 మంది యూరాలజీ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్లు ఉన్నారు. మరో ముగ్గురు క్రిటికల్ కేర్ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన వారు ఉన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ నిర్ధారణ రావడం ఏంటని సిబ్బంది ప్రశ్నించుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఒక్కరోజే 5,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 13న 6,239 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మళ్లీ ఇప్పుడు ఆ సంఖ్యకు చేరువలో కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్నోలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 1188 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు చనిపోయారు.