జైపూర్, నవంబర్ 11: కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో నాలుగేండ్ల బాలికపై ఓ సబ్ ఇన్స్పెక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది రాష్ట్ర ప్రజల్ని షాక్కు గురి చేసింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట నిందితుడు ఎస్ఐ భూపేంద్ర సింగ్ను గ్రామస్థులు చితకబాదారు. ఎన్నికల విధుల నిమిత్తం గ్రామానికి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం బాలికను తన గదికి పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.