న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భల్స్వా డంపింగ్ యార్డ్లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. మంటలు అంటుకుని 36 గంటలైనప్పటికీ ఆరిపోలేదు. భల్స్వా ల్యాండ్ఫిల్ (Bhalswa landfill) సైట్లో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డంపింగ్ యార్డ్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో అగ్నిపాక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి గత రెండు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ చితిమంటలు అదుపులోకి రాలేదు. గురువారం ఉదయం కూడా భల్స్వా సైట్లో ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపుచేయడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
కాగా, ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న నివాస సముదాయాల్లోని ప్రజలు తమకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లు మొత్తం బూడిదతో నిండిపోయాయని, దుర్వాస వస్తున్నదని చెప్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.