చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ట్రాఫిక్ లైట్లు కూడా పని చేయకపోవడంతో వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా పలు శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. జనరేటర్లతో ఆస్పత్రులను నడపడం అసాధ్యమని చండీఘడ్ హెల్తె సర్వీసెస్ డైరెక్టర్ సుమన్ సింగ్ తెలిపారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చాలా శస్త్ర చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖలో ఆరు నెలల వరకు ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ప్రభుత్వ నోటీసులు జారీ చేసింది.