న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ 35,000 కోట్ల బడ్జెట్లో ఇప్పటివరకూ రూ 9229 కోట్లు ఖర్చయ్యాయి. మూడు వ్యాక్సిన్ తయారీదారుల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు కేటాయించిన బడ్జెట్లో 37.9 శాతం వెచ్చించినట్టు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.మార్చి-జులైలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ 21 కోట్ల డోసుల సేకరణకు, భారత్ బయోటెక్కు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఏడు కోట్ల డోసుల కొనుగోలుకు మొత్తం 4410 కోట్లు చెల్లించామని పేర్కొంది.
వ్యాక్సిన్ల సేకరణకు ఇప్పటివరకూ ఖర్చు చేసిన రూ 9229 కోట్లలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో 30 కోట్ల కొర్చివ్యాక్స్ డోసుల కోసం హైదరాబాద్కు చెందిన బయలాజికల్ ఈకి అడ్వాన్స్ కింద చెల్లించిన రూ 1500 కోట్లు కలిసిఉన్నాయని తెలిపింది. ఇక 37.5 కోట్ల కొవిషీల్డ్ డోసుల కొనుగోలుకు డోసు ఒక్కింటికి రూ 215 చొప్పున రూ 2521 కోట్లను అడ్వాన్స్గా సీరం ఇనిస్టిట్యూట్కు జులై 16న విడుదల చేశామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
మరోవైపు డోసు ఒక్కోటి 228.75 చొప్పున 28.5 కోట్ల కొవాగ్జిన్ డోసుల కోసం భారత్ బయోటెక్కు రూ 897 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించింది. ఇక జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి, వ్యాక్సిన్ వృధాల ఆధారంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కొవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేస్తోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.