స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏరు దాటక ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే నానుడి బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్ ధరల పెంపుతోపాటు.. వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేతను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది. 2019 లోక్సభ ఎన్నికల ముందు వరకు దాదాపు రూ.34 వేల కోట్లుగా ఉన్న సబ్సిడీ.. ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు తగ్గిందంటే.. బీజేపీ ప్రజలను ఎలా మోసం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సబ్సిడీ వివరాలపై ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రినే ఈ సమాచారం వెల్లడించారు.
ఎన్నికలు ముగియగానే అసలు రంగు..
ఏవైనా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా.. బీజేపీ తన అసలు రంగు బయటపెడుతుంది. ఎన్నికలు సమీపించే కొద్దీ సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈ దొంగ ప్రేమ.. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనిపించింది. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్ ధరలు దాదాపు ఐదు నెలలపాటు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఫలితాలు వెలువడగానే ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
సబ్సిడీ ఎత్తివేతతో భారం
2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఇలానే ప్రజలను మోసగించింది. అప్పటి వరకు గ్యాస్ సిలిండర్పై ఇస్తున్న సబ్సిడీని ఎన్నికల తర్వాత ఎత్తేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 మేలో సిలిండర్ ధర రూ.728 ఉండగా, ప్రస్తుతం 2022 డిసెంబర్కు అది రూ.1105 కు చేరుకొన్నది.
రాయితీని నిలువునా కోసిన కేంద్రం
2019-20లో వంటగ్యాస్ సిలిండర్లపై ఇచ్చిన సబ్సిడీ అక్షరాలా రూ.33,443 కోట్లు. ఇందులో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.29,719 కోట్ల సబ్సిడీని బదిలీ చేయగా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకం కింద సిలిండర్లపై ఇచ్చిన సబ్సిడీ మొత్తం రూ.3,724 కోట్లు.
ఎన్నికలు ముగిశాక 2020 జూన్ నుంచి వంటగ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని కేంద్రం ఎత్తేసింది. 2021-22లో సిలిండర్పై కేవలం రూ.40 మాత్రమే భరిస్తున్నది. దీంతో సిలిండర్లపై రూ.35,310 కోట్లు ఉన్న సబ్సిడీ 2022-23 సంవత్సరానికి రూ. 4,864 కోట్లకు తగ్గింది. పీఎంయూవై కింద సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని రూ.200 కు పరిమితం చేయడంతో.. ఈ సబ్సిడీ రూ.3,724 కోట్ల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లకు తగ్గింది.