న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్నది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 321 మందికి డెంగీ ఫీవర్ సోకింది. సెప్టెంబర్ నెలలో కూడా ఢిల్లీలో డెంగీ కేసులు భారీగానే నమోదయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 693 మంది డెంగీ బారినపడ్డారు.
ఢిల్లీలో ఈ ఏడాది జనవరి నుంచి నెలకు 20, 25 చొప్పున కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ ఆగస్టులో ఉన్నట్టుండి 75 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్లో ఏకంగా 693 మందికి డెంగీ వచ్చింది. ఈ నెలలో మొదటి ఐదు రోజుల్లోనే 321 కేసులు రికార్డయ్యాయి. నెలాఖరు వరకు మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నది.
కాగా, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మొత్తం 1258 మందికి డెంగీ ఫీవర్ సోకింది. అయితే డెంగీ బారినపడిన బాధితులంతా కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం సంతోషకరమైన పరిణామం.