Historic Move | తమిళనాడులో చారిత్రక మలుపు సంభవించింది. 300 మంది ఎస్సీలు ఇక్కడి ఓ ఆలయంలోకి ప్రవేశించారు. తనివితీరా పూజలు నిర్వహించి ఆనందపరవశంలో మునిగితేలారు. దాదాపు 8 దశాబ్దాల తర్వాత వీరికి ఆలయ ప్రవేశం దక్కడం విశేషంగా చెప్పుకోవాలి. వీరిని అడ్డుకునేందుకు వచ్చిన పలువుర్ని పోలీసులు నిలువరించారు. పరిస్థితి విషమంగా తయారుకాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లుగా ఆలయ ప్రవేశం లేని విషయం ఓ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్లో బయటపడటం విశేషం.
తిరువణ్ణామలై జిల్లాలోని తెన్ముడియనూర్ గ్రామంలో 200 ఏండ్ల అతి పురాతన ఆలయం ఉన్నది. ఈ గ్రామంలో నివసించే దాదాపు 500 ఎస్సీ కుటుంబాలకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. ఈ ఆచారాన్ని మార్చేందుకు కూడా ఇన్నాళ్లూ ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనిపై ఆలోచన జరగలేదు. అయితే, ఇటీవల గుడిలోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నం చేయగా.. మరొక వర్గం అడ్డుకున్నది. దాంతో జిల్లా ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి పోలీసుల ఆధ్వర్యంలో వారికి ఆలయ ప్రవేశం జరిపించాలని నిర్ణయించారు. దీనికి నిరసనగా దాదాపు 750 మంది ఆలయాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పూనుకున్నారు. పోలీసులు వీరిని నిలువరించడంతో ఎస్సీలు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి పూజలు చేశారు.
‘నాకు బిడ్డ పుట్టినంత సంతోషంగా ఉన్నది’ అని విజయ అనే పెద్దావిడ సంతోషం వ్యక్తం చేశారు. ‘నేను ఇదే గ్రామంలో పుట్టిపెరిగినా తనకు ఆలయంలోకి అనుమతించలేదని, ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఈ సమానత్వం ప్రతిరోజూ కొనసాగాలి’ అని కాలేజీ విద్యార్థిని గోమతి చెప్పారు. ఈ ఆలయంలో అమ్మవారిని ఇన్నేండ్లలో చూడటం ఇదే తొలిసారి అని, బయట నిలబడి పూజలు చేసిన తాము ఇలా లోనికి రావడం చాలా బాగుందని మణిమేకలై అనే యువతి అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ పీ మురుగేశ్, ఎస్పీ డాక్టర్ కార్తికేయన్లకు ఎస్సీ కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.