BRS | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నవభారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ శక్తులు, ప్రగతికాముక శక్తులు, మేధావులు కలిసి వస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని నాగ్పూర్, ఔరంగాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు కీలక రాజకీయ నాయకులు, ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఔరంగాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ వినోద్ తంబే, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ నుంచి యవత్మాల్ లోక్సభ స్థానానికి పోటీ చేసిన ప్రవీణ్పవార్ బీఆర్ఎస్ పార్టీలో చేరటం ప్రాధాన్యం సంతరించుకున్నది. వీరితోపాటు షుగర్ ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్ దత్తాత్రే కాంబ్లే, చావా సంఘటన మాజీ అధ్యక్షుడు విఠల్ దేశ్ముఖ్, నితిన్ భోంస్లే, జీవన్భోంస్లే, గజానన్ చవాన్, శంకర్ గలేవాడ్, ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన టౌన్ కార్పొరేటర్లు అఫ్జర్ అస్తర్ షేక్, సుభాశ్ ఫజీరావ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఔరంగాబాద్శాఖ సెక్రటరీ ఖాజా అక్బర్ షేక్, కాంగ్రెస్ పార్టీ తాలూకా అధ్యక్షుడు వినోద్ పాటిల్ తంబే, కాంగ్రెస్ పార్టీ ఔరంగాబాద్ ఉపాధ్యక్షుడు బాలాసాహెబ్ పాటిల్, మాజీ నగర సేవక్ జమీల్ఖాన్, ధన్గర్ సమాజ్ అధ్యక్షుడు బందు పార్ఖే తదితర 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.