న్యూఢిల్లీ, అక్టోబర్ 14: మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు, ఆత్మహత్యలు మొత్తం 1,64,033 కాగా అందులో 7 శాతం ఆత్మహత్యలు అన్నదాతలవే. సూసైడ్ చేసుకొన్న రైతుల్లో 5,318 మంది రైతులు, 5,563 మంది రైతు కూలీలు ఉన్నారని ఎన్సీఆర్బీ వెల్లడించింది. 2017-2021 మధ్య దాదాపు 53 వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకొన్నారని వివరించింది. గత ఐదేండ్ల కాలంలో వ్యవసాయ రంగంలో చోటుచేసుకొన్న బలవన్మరణాలు 2021లోనే అత్యధికమని తెలిపింది.
గత ఏడాది ఆత్మహత్య చేసుకొన్న రైతుల్లో మహారాష్ట్రకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 4,064 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు తీసుకోగా అందులో 2,429 మంది రైతులు ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో 2,169 మంది, ఆంధ్రప్రదేశ్లో 2,150, మధ్యప్రదేశ్లో 1,342, తమిళనాడులో 1,196 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. ఇక, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో సూసైడ్స్ నమోదు కాలేవని ఎన్సీఆర్బీ పేర్కొన్నది.
అన్నదాత.. మృత్యుఘోషదేశంలో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది 10,881 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదేండ్లలో ఇదే అత్యధికం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఆదాయం అటుంచితే.. ఆత్మహత్యలను రెట్టింపు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఎన్సీఆర్బీ నివేదికపై ప్రతిపక్షాలు, నెటిజన్లు స్పందిస్తూ మోదీ సర్కారుపై మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే దేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి గద్దె నెక్కిన ప్రధాని మోదీ.. ఆదాయం సంగతి అటుంచి, రైతులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేశారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో ఎంతోమంది ఉసురు తీసుకొన్నారని విమర్శించారు. మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.