ముంబై: పదో తరగతి పరీక్షల్లో (SSC Exams) జవాబులు చూపించడానికి నిరాకరించాడని విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటుచేసుకున్నది. ఎస్ఎస్సీ పరీక్షల్లో భాగంగా భీవండిలోని ఓ స్కూల్లో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని ఆన్సర్ షీట్ చూపించాలని తోటి విద్యార్థులు అడిగారు. అందుకు అతడు తిరస్కరించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ముగ్గురు స్టూడెంట్స్.. ఆ విద్యార్థి పరీక్షా కేంద్రం నుంచి బయటకు రాగానే చితకొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు దవాఖానాలో చేర్చారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. బాధితుడు ఇప్పటికే దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యాడని చెప్పారు. నిందితులైన ముగ్గురు మైనర్ విద్యార్థులను పట్టుకుంటామని వెల్లడించారు.