కోల్కతా: గత రెండేండ్లలో 1300 ఇండియన్ సిమ్ కార్డులను చైనాకు పంపినట్లు గురువారం సరిహద్దులో అరెస్టైన ఆ దేశ జాతీయుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 2010 నుంచి నాలుగు సార్లు భారత్కు వచ్చానని, గురుగ్రామ్లో స్టార్ స్ప్రింగ్ పేరుతో సొంత హోటల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, అతడు చెప్పిన వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించిన చైనా జాతీయుడ్ని బీఎస్ఎఫ్ అధికారులు గురువారం పసిగట్టి అరెస్ట్ చేశారు. హుబ్లీలో నివాసం ఉంటున్న హాన్ జున్వేగా అతడ్ని గుర్తించారు. లాప్టాప్, రెండు ఐఫోన్లు, రెండు పెన్ డ్రైవ్లు, బంగ్లాదేశ్ సిమ్ కార్డు, ఏటీఎం కార్డులు, అమెరికా, ఇండియన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన కరెన్సీని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
చైనా జాతీయుడైన జున్వే ఏదైనా నిఘా సంస్థ తరుఫున పని చేస్తున్నాడా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు బీఎస్ఎఫ్ డీజీఐ ఎస్ఎస్ గులేరియా తెలిపారు. గతంలో చైనా జాతీయుడు జియాంగ్ను అరెస్టు చేసినప్పుడు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి జున్వే, అతడి భార్య పేర్లను అతడు పేర్కొన్నట్లు చెప్పారు. దీంతో జున్వే, అతడి భార్యపై లక్నోలో ఏటీఎస్ కేసు నమోదు చేసిందని వివరించారు. ఫలితంగా జున్వే భారతీయ వీసా పొందలేకపోయాడని, దీంతో నేపాల్, బంగ్లాదేశ్ నుండి వీసా సంపాదించిన అతడు గురువారం దేశంలోకి ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు గులేరియా వెల్లడించారు.