హైదరాబాద్ : తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో సోమవారం ఉదయం భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సరిహద్దులో చోటు చేసుకుంది.
తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ దళాలు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బీజాపూర్, ములుగు సరిహద్దులోని తర్లగూడ వద్ద మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.