లక్నో: ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు. భదోహిలోని దుర్గామాత మండపంలో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హారతి ఇస్తుండగా ప్రమాద వశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక యంత్రం సహాయంతో మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు. షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.