బెంగళూరు : లండన్ నుంచి బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (KIAL) వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్యశాఖవర్గాలు తెలిపాయి. 30 సంవత్సరాల మహిళతో పాటు ఆరు సంవత్సరాల ఇద్దరు బాలురుకు వైరస్ సోకినట్లు గుర్తించగా.. వారిని ఐసోలేషన్కు తరలించారు. హైరిస్క్ దేశాల నుంచి వచ్చినందున వారి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
ఇప్పటి వరకు కర్ణాటకలో ముగ్గురికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు పాజిటివ్గా పరీక్షించారు. ఇద్దరు విదేశాల నుంచి రాగా.. మరొకరు స్థానిక వ్యక్తి. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్కు పాజిటివ్గా పరీక్షించిన మూడో వ్యక్తి కాంటాక్టులందరికీ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఒమిక్రాన్ బారినపడ్డ మూడో వ్యక్తి డిసెంబర్ 1న దక్షిణాఫ్రికా నుంచి కొవిడ్ నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ రాగా.. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో చేసిన కొవిడ్ పరీక్షలు పాజిటివ్గా తేలింది.
ఇంటికి చేరిన తర్వాత స్వల్పంగా లక్షణాలు కనిపించగా.. కొవిడ్ టెస్ట్ కోసం ల్యాబ్కు వెళ్లి పరీక్షలు చేసుకున్నాడు. ఒమిక్రాన్ ఆందోళనలు, కొవిడ్ కేసుల పెరుగుదల మధ్య ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మాల్స్, సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలకు వెళ్లే వ్యక్తులకు రెండు డోసుల టీకా తప్పనిసరి చేసింది.