న్యూఢిల్లీ: లోక్సభ, నాలుగు రాష్ర్టాల శాసన సభల ఎన్నికల నిర్వహణ కోసం 3.4 లక్షల మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సిబ్బంది అవసరమని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకాలు లేకుండా రైళ్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపింది. సిబ్బందిని దశలవారీగా వివిధ ప్రాంతాలకు తరలించవలసి ఉంటుందని చెప్పింది.
ఓటర్లలో నమ్మకాన్ని పెంచే చర్యలు, పోలింగ్ రోజున నిర్వహించే విధులు, ఈవీఎంల భద్రత, స్ట్రాంగ్ రూమ్స్ భద్రత వంటి విధుల్లో సీఏపీఎఫ్ సిబ్బందినే నియమించాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్స్ కోరారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా జరగడం కోసం సుమారు 3,400 కంపెనీల సీఏపీఎఫ్ సిబ్బందిని దశలవారీగా మోహరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసన సభల ఎన్నికలు కూడా త్వరలో జరుగుతాయి.
ఈసీలోని ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అనూప్ చంద్ర పాండే (65) బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో అత్యంత కీలక సమయంలో ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీ అయింది. పాండే 2021 జూన్లో ఈసీలో చేరారు.