Odisha Train Accident | ఎక్కడ చూసినా మృతదేహాల కుప్పలు. తెగిపడిన శరీర భాగాలు, క్షతగాత్రుల హాహాకారాలు. రక్తంతోతడిసిసోయిన రైలు పట్టాలు. నాన్నా, అమ్మా, బిడ్డా ఎక్కడున్నావ్? అంటూ బంధువుల రోదనలు. ఇవీ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలిలో కనిపించిన విషాదకర దృశ్యాలు. మూడు రైళ్లు ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా మృతుల దిబ్బగా మారింది. రైళ్లు ఢీకొని బోగీలు గాల్లోకి ఎగిరిపడటంతో ప్రమాద తీవ్రత ఊహకు కూడా అందని విధంగా ఉన్నది.
Odisha Train Accident | బాలాసోర్/భువనేశ్వర్, జూన్ 3: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, ఇతర సిబ్బంది క్రేన్లు, బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానలకు తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన రెండు రైళ్ల ఇంజిన్ డ్రైవర్లు, గార్డులకు గాయాలయ్యాయని, వారికి దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు రైల్వే అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. ఈ ఘటనలో గూడ్స్ రైలుకు చెందిన డ్రైవర్, గార్డుకు ఎటువంటి గాయాలు కాలేదు.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, రైల్వే, ఇతర బృందాలు పాల్గొన్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు 200 అంబులెన్స్లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లను వినియోగించారు. గాయపడిన వారిని తరలించేందుకు రెండు ఎంఐ-17 హెలికాప్టర్లను రంగంలోకి దించినట్టు రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, రైలు పట్టాలను పునరుద్ధరించే పని చేపట్టామని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ శనివారం సాయం త్రం వెల్లడించారు.
ప్రమాద సమయంలో రెండు రైళ్లలో సుమారు 3 వేల మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తున్నది. వీటిల్లో బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్లోని రిజర్వ్డ్ కోచ్ల్లో ఎవరికీ గాయాలు కాలేదని, ఎవరూ చనిపోలేదని రైల్వే అధికారులు శనివారం పేర్కొన్నారు. అయితే జనరల్ బోగీల్లోని కొంతమందికి గాయాలు అయ్యాయని తెలిపారు. హౌరా ఎక్స్ప్రెస్లో 994 మంది రిజర్వ్డ్, 300 మంది అన్రిజర్వ్డ్ ప్యాసింజర్లు ఉన్నారని సౌత్ వెస్టర్న్ రైల్వే అధికారులు వెల్లడించారు.
క్షతగ్రాతులతో బాలాసోర్ జిల్లా దవాఖాన, సోరో హాస్పిటల్ ప్రాంగణాలు యుద్ధ భూముల్లా కనిపించాయి. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉండడంతో పేషెంట్లకు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దవాఖాన కారిడార్లు స్ట్రెచ్చర్లు, రోగులతో నిండిపోయాయి. తీవ్ర గాయాలతో ఉన్న 64 మందిని కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ దవాఖానకు పంపించామని బాలాసోర్ దవాఖాన ఏడీఎంవో మృత్యుంజయ్ మిశ్రా తెలిపారు. క్షతగ్రాతుల్లో అధికంగా ఒడిశాయేతర రాష్ర్టాల వారు ఉండడంతో భాష పరంగా కూడా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఇతర రాష్ర్టాలకు చెందిన క్షతగాత్రులతో కమ్యూనికేట్ చేసుకోవడానికి వైద్యులు, నర్సులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. వైద్య సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎయిమ్స్-భువనేశ్వర్ నుంచి వైద్యులను బాలాసోర్, కటక్లకు పంపించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ తెలిపారు.
ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియరావడం లేదు. బహానగర్ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ మెయిన్ ట్రాక్ నుంచి లూప్లైన్ ట్రాక్లోకి వచ్చి అక్కడ ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొనడంతోనే ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోరమాండల్ రైలుకు అప్ మెయిన్ లైన్ ట్రాక్పై వెళ్లేందుకు మొదట సిగ్నల్ ఇచ్చి, తర్వాత తీసేశారని నివేదిక చెబుతున్నది. కోరమాండల్కి చెందిన దాదాపు 20 బోగీలు పట్టాలు తప్పాయని, ఇందులో మూడు బోగీలు పక్కన ట్రాక్పై పడ్డాయని తెలిపింది. తర్వాత ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టిందని, దీంతో హౌరాకి చెందిన రెండు బోగీలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇదే సమయంలో సిగ్నల్ తప్పిదం కారణంగా కోరమాండల్ లూప్ లైన్లోకి వెళ్లి గూడ్స్ను ఢీకొట్టిందా? లేక కోరమాండల్ పట్టాలు తప్పి పార్కింగ్ చేసివున్న గూడ్స్ను తాకిందా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
అంతా కొద్ది నిమిషాల్లోనే ఈ విషాద ఘటన చోటుచేసుకొన్నదని అధికారులు, స్థానికులు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాద తీరు ఇలా ఉన్నది..
ఒడిశా రైలు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం. 288 మంది ప్రయాణికులు మరణించడం చాలా విషాదకరం. బాధితుల కుటుంబాలకు ధైర్యాన్నివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. యాంటీ కొలైజన్ పరికరాలు పని చేయడం లేదు. వాటికి ఏమైంది? ఇది నిజంగా ఘోరమైన దుర్ఘటన. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు. -మంత్రి కేటీఆర్