న్యూఢిల్లీ: కోవిడ్ ఫ్రీ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు షెడ్యూల్ను ప్రకటించారు. కరోనా మహమ్మారి వేళ ఎన్నికల నిర్వస్తున్న సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను సీఈసీ వెల్లడించారు. మొత్తం 690 స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. కొత్త ప్రోటోకాల్ను జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 24.9 లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నట్లు ఆయన చెప్పారు. 2017తో పోలిస్తే పోలింగ్ బూత్ల సంఖ్యను పెంచినట్లు సుశీల్ వెల్లడించారు. 5 రాష్ట్రాల్లో 18.34 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. మొదటిసారి కొత్తగా 11.4 లక్షల మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్యశాఖ, హోంశాఖ, రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో ఎన్నికల సంఘం చర్చలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఆన్లైన్లో నామినేషన్..
పోలింగ్ బూత్లను 16 శాతం పెంచారు. పోలింగ్ బూత్ల్లో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు సీఈసీ చెప్పారు. ఇక కోవిడ్ మూలంగా అభ్యర్థుల నామినేషన్ను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు సుశీల్ చంద్ర వెల్లడించారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 40 లక్షలకు ఫిక్స్ చేశారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 28 లక్షలు ఉంటుందని సీఈసీ వెల్లడించారు.
జనవరి 15వ తేదీ వరకు రోడ్డు షోలు, సైకిల్ యాత్రలపై నిషేధం విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు ప్రచారం ఉండదు. అభ్యర్థులు డిజిటల్ ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చారు.