న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలు-3లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఖైదీని (Inmate) పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతనివద్ద ఓ ప్యాకెట్ లభించింది. అందులో 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్ (Drugs), రెండు స్మార్ట్ ఫోన్లు (Smartphones), ఓ సిమ్ కార్డు లభించాయి. ఆ ప్యాకెట్ను గుర్తుతెలియని వ్యక్తి జైలు గోడ బయట నుంచి లోపలికి విసిరినట్లు గుర్తించారు. అయితే వాటిని ఎవరికోసం, ఎందుకు జైలులోకి తీసుకొచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో నూతన విద్యా విధానానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను (Manish Sisodia) కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. బుధవారం (మార్చి 8న) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిసోడియాను హత్య చేయడానికే అక్కడ ఉంచారేమోనని, ఆయనకు అక్కడ ప్రాణహాని ఉన్నదని ఆరోపించారు. అసలు మొదటిసారి ఖైదీ అయిన వ్యక్తిని అలాంటి నేరస్థులతో ఉంచుతారా? అని ప్రశ్నించారు.
ఒక అండర్ట్రైల్ ఖైదీని సెల్ నెంబర్1లో ఉంచరని, అందులో హంతకులు, కరడుగట్టిన నేరస్థులు, కొందరు పిచ్చివాళ్లు కూడా ఉంటారని మరో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను తీహార్ జైలు అధికారులు కొట్టివేస్తూ సిసోడియా భద్రత దృష్ట్యా అతడిని వేరొక వార్డుకు మారుస్తున్నట్టు తెలిపారు. వీలైతే ప్రత్యే సెల్ కేటాయిస్తామన్నారు.