Gujarat | కల్తీ మద్యం 21 మందిని బలి తీసుకోగా.. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకున్నది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. బోటాడ్ జిల్లాలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ధందుక, భావ్నగర్లో మరో ఐగురు మృతి చెందారు. భావ్నగర్, బోటాడ్, బర్వాలాలోని ఆసుపత్రుల్లో మరికొందరు బాధితులు చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
కల్తీ మద్యం తయారుచేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం బోటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలోని పలువురు, ధందుక, భావ్నగర్ ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ సైతం దర్యాప్తులో చేరాయని బొటాడ్ పోలీస్ సూపరింటెండెంట్ కరణరాజ్ వాఘేలా తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.