భోపాల్: ఒక అనాథాశ్రమంలో పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చిన్నచిన్న తప్పులకు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి వాతలు పెట్టారు. నాలుగేళ్ల బాలుడికి రెండు రోజులపాటు ఆహారం పెట్టకుండా బాత్రూమ్లో నిర్బంధించారు. ఆ అనాథాశ్రమాన్ని తనిఖీ చేసిన అధికారులు ఈ దారుణాలు తెలుసుకుని షాక్ అయ్యారు. (Indore Orphanage) మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. వాత్సల్యపురం ప్రాంతంలో జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శరణాలయాన్ని శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) బృందం గతవారం తనిఖీ చేసింది.
కాగా, ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సుమారు 21 మంది పిల్లలను చిత్రహింసలకు గురిచేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. చిన్న తప్పులకు దారుణంగా శిక్షించినట్లు అక్కడి పిల్లలు అధికారులకు చెప్పారు. బట్టలు విప్పించి నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి వాతలు పెట్టినట్లు ఆరోపించారు. శరీరంపై ఉన్న వాతల గాయాలను వారికి చూపించారు.
మరోవైపు ఆ అనాథాశ్రమానికి సంబంధించిన మరిన్ని దారుణాలు బయపడ్డాయి. మిరపకాయలను కాల్చి పొగ పీల్చమని పిల్లలను సిబ్బంది బలవంతం చేసేవారు. ప్యాంట్లో మలవిసర్జన చేసుకున్న నాలుగేళ్ల బాలుడ్ని రెండు రోజులు ఆహారం ఇవ్వకుండా బాత్రూమ్లో బంధించారు.
ఈ దారుణాలు తెలుసుకున్న పిల్లల సంక్షేమ సంఘం కమిటీ అధికారులు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆ అనాథాశ్రమానికి సీల్ వేశారు. అక్కడ పని చేస్తున్న ఐదుగురు సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో ఉంటున్న మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్కు చెందిన అనాథ పిల్లలను ప్రభుత్వ వసతిగృహాలకు తరలించారు. ఇండోర్తోపాటు బెంగళూరు, సూరత్, జోధ్పూర్, కోల్కతాలో కూడా ఈ ట్రస్ట్కు అనాథాశ్రమాలు ఉన్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు.