శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్కు చెందిన 20 మంది రాజకీయ నేతలు తమ భద్రతను పరిపాలన ఉపసంహరించింది. ఈ మేరకు ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరికొందరు నేతల భద్రతను కుదించారు. రాజకీయ నాయకులకు కల్పిస్తున్న భద్రతా సిబ్బందితో పాటు వారి ఎస్కార్ట్ సౌకర్యాన్ని ఉపసంహరించారు. ఇందులో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలు కాగా, ఒకరు మాజీ ఎంపీ. వీరితో పాటు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అల్లుడు, జేఅండ్కే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మహ్మద్ అసిమ్ ఖాన్ భద్రతను తొలగించారు. భద్రతను ఉపసంహరించిన నేతల జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతల పేర్లున్నాయి. ఈ నేతలకు చాలాకాలంగా జమ్మూ కశ్మీర్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ భద్రత ఉంది.
ఈ జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ ఎమ్మెల్యేలు పీర్ అఫాక్ అహ్మద్, అలీ మహ్మద్ దార్, గులాం నబీ భట్, మీర్ సైఫుల్లా, మహ్మద్ రంజాన్, ముబారక్, అలీ మహ్మద్ సాగర్, ఖైజర్ అహ్మద్ లోన్, పీర్జాదా గులాం అహ్మద్ షా, జీఎస్ ఒబెరాయ్ నేషనల్ కాన్ఫరెన్స్ కోశాధికారి, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రైవేట్ సెక్రెటరీ తన్వీర్ సాదిక్, పీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ముస్తాక్ అహ్మద్ షా, సర్తాజ్ అహ్మద్ మదానీ, పీడీకీకి చెందిన మాజీ ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్, బుద్గాం డీసీసీ చైర్మన్ నజీర్ అహ్మద్ ఖాన్ పేర్లున్నాయి. ఇదిలా ఉండగా.. గత జనవరిలో ఫరూక్ అబ్దుల్లా, గులామ్ నబీ ఆజాద్ సహా మాజీ ముఖ్యమంత్రుల భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. నలుగురు మాజీ సీఎంల భద్రత (SSG) పరిధిని తగ్గించారు. 2000లో ఏర్పాటైన ఎలైట్ ‘ఎస్ఎస్జీ’ యూనిట్ను మూసివేయాలని కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది మార్చి 31న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ ఒకప్పటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ను సవరించారు. మాజీ ముఖ్యమంత్రులు, వారి కుటుంబాలకు ఎస్ఎస్జీ భద్రత కల్పించే నిబంధనను తొలగించారు. సెక్యూరిటీ రివ్యూ కో-ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు ఎస్ఎస్జీని ఐజీ లేదంటే అంతకన్నా ఎక్కువ స్థాయి అధికారి పర్యవేక్షించడంతో పాటు నిర్వహించే వారు. ఇప్పుడు ఆ కమాండ్ను పోలీస్ సూపరింటెండెంట్ స్థాయికి తగ్గని అధికారికి అప్పగించారు. ఎస్ఎస్జీ ఇప్పుడు సేవలందిస్తున్న ముఖ్యమంత్రులు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించనున్నారు. ఈ నిర్ణయంతో ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు భద్రత తగ్గింది. అయితే, ఫరూక్ అబ్దుల్లా మరియు గులాం నబీ ఆజాద్లకు బ్లాక్ క్యాట్ కమాండోస్ అని పిలిచే.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ల భద్రత కల్పించారు. ఈ కారణంగా వారికి జెడ్ ప్లస్ భద్రత ఉంది. 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ పరిపాలన 18 మంది వేర్పాటువాదులు, 155 మంది నాయకుల భద్రతను ఉపసంహరించుకున్న విషయం విధితమే.