లక్నో : ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 412 కంపెనీలకు చెందిన 50 వేల మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య ఏడు విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలో 14న, పంజాబ్లో 20న, మణిపూర్లో ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.