గువాహటి: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అసోంలోని గోల్పారాలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో ఓ ఇంటి గోడపై కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అక్కడున్న ఇద్దరు చిన్నారులపై మట్టిపెల్లలు పడటంతో వారు సజీవ సమాధి అయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింది నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు.