రాంచీ: జార్ఖండ్లోని (Jharkhand) సెరియకేలా-ఖర్సవాన్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ దళాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు సీపీఐ మావోయిస్టులు మరణించారని కొల్హాన్ ఐజీ అజయ్ లిండా తెలిపారు. వారివద్ద తుపాకులు, ఆయుధ సామాగ్రి లభించాయని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.