న్యూఢిల్లీ, నవంబర్ 30: రెండు కిలోమీటర్ల రోడ్డు దొంగతనానికి గురైంది. కరెంటు బల్బులు ఎత్తుకుపోవడం చూశాం.. చెట్లకు పెట్టే ముళ్ల కంచెలు మాయం కావడం చూశాం.. కానీ రోడ్డు దొంగిలించడం ఏమిటి అంటారా? బీహార్లోని ఖరౌనీ గ్రామంలో అదే జరిగింది. బంకా జిల్లా రాజౌరీ బ్లాకులో ఉంటుందా గ్రామం. ఖరౌనీని ఖదంపూర్తో కలిపే రోడ్డు ఐదురోజుల క్రితం వరకు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. రోడ్డు స్థానంలో పొలం వెలిసింది. అటుగా వెళ్లినవాళ్లు దారితప్పామా అని కంగారు పడ్డారు. కానీ రోడ్డు పోయి మొక్కలు ప్రత్యక్షమయ్యాయి.
ఖైరానీ గ్రామానికి చెందిన గూండాలు రోడ్డును ట్రాక్టర్లతో దున్నేసి మొక్కలు నాటారని తెలిసింది. ఏండ్లుగా వినియోగిస్తున్న రోడ్డు మాయం కావడంపై గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. ఖదంపూర్ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నిందితులు ఆక్రమణలకు పాల్పడినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకొంటామని అధికారులు హామీ ఇచ్చారు.