భోపాల్: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు. (Heat Stroke) గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో గత 15 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. గ్వాలియర్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. ఈ ఎండలకు జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. బుధవారం ఎండ తీవ్రతకు ఇద్దరు పిల్లలు మరణించారు. తల్లితో పాటు బయటకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక, 15 ఏళ్ల బాలుడు ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురై చనిపోయారు. ఒక ఆటో డ్రైవర్ కూడా రోడ్డుపైనే మృత్యువాత పడ్డాడు. సోమవారం, మంగళవారం కూడా వడదెబ్బ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు.
కాగా, గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.