చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ స్కూల్ లో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధిక డోసులో ఐరన్ ట్యాబ్లెట్లు(Iron Tablets) తీసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. ఆ విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతావతి తహిసిల్లోని భండేలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల అస్వస్థతపై దర్యాప్తు చేపట్టారు.
ప్రతి సోమవారం స్కూల్ విద్యార్థులకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. అయితే మంగళవారం రోజున కూడా కొందరు స్కూల్ స్టూడెంట్స్ మరిన్ని ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. టీచర్లు లేని సమయంలో స్టూడెంట్స్ ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నారు. డోసు ఎక్కువ కావడంతో బుధవారం రాత్రి ఆ విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు.
అంబులెన్సులను రప్పించిన స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను చంద్రాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల ప్రకారం 16 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నది. మరో ముగ్గురు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఈ ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణకు జిల్లా పరిషత్ సీఈవో ఆదేశించారు.