CM Convoy | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం కాన్వాయ్ (CM Convoy)లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్డౌన్ (Break Down) అయ్యాయి. దీంతో ఏం జరిగిందో అర్థంకాక అధికారులు కాసేపు తలలు పట్టుకున్నారు. అనుమానం వచ్చి డీజిల్ ట్యాంక్లను తెరిచి చూడగా.. అందులో నీళ్లు ఉండటంతో షాక్ అయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) గురువారం రాత్రి రత్లాంకు (Ratlam) రోడ్డు మార్గంలో బయల్దేరారు. మార్గం మధ్యలో ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలకు డీజిల్ (diesel) కొట్టించారు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించిన వాహనాలు.. ఒకదాని తర్వాత ఒకటి తీవ్ర కుదుపులకు గురై ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఏం జరిగిందో అర్థం కాక సిబ్బంది కాసేపు తలలు పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సిబ్బంది వాహనాలను రోడ్డు పక్కకు తోసుకెళ్లారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని కార్లు ఎందుకు బ్రేక్డౌన్ అయ్యాయన్న దానిపై పరిశీలించారు. ఈ క్రమంలో డీజిల్ ట్యాంక్లను ఓపెన్ చేసిన చూడగా.. అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనాల్లోని డీజిల్ను బయటకు తీసి చూడగా.. అందులో సగానికి పైగా నీళ్లే ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు సదరు పెట్రోల్ పంప్ వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. కల్తీని నిర్ధారించి ఆ పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
Kolkata | కోల్కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
building collapses | భారీ వర్షాలకు కుప్పకూలిన భవనం.. ముగ్గురు వలస కార్మికులు మృతి