Chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్లో కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లి వస్తున్న జవాన్ల వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రావ్ఘాట్ – తాడోకి ప్రాంతాల మధ్యకు చేరుకోగానే వ్యాన్ స్టీరింగ్ ఫెయిలవ్వడంతో వాహనం బోల్తా పడిందని నారాయణ్పూర్ జిల్లా ఎస్పీ పుష్కర్ శర్మ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ జవాన్లను నారాయణపూర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారని అన్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాయ్పూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.