Medical colleges | దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది. వసతుల కల్పనలో విఫలమవడం, అధ్యాపకుల కొరత, బయోమెట్రిక్లో అవకతవకలు తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు తమ గుర్తింపును కోల్పోయే ప్రమాదంలో పడినట్టు ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. గుజరాత్, అస్సాం, పుదుచ్చేరి, త్రిపుర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ర్టాల్లోని కళాశాలల మెడలపై గుర్తింపు కత్తి వేలాడుతున్నది.
దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగిన తనిఖీల్లో ఆయా రాష్ర్టాల్లోని కళాశాలలు నియమ, నిబంధనలను పాటించడం లేదని ఎన్ఎంసీ గుర్తించింది. సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నచోట్ల అవి పని చేయకపోవడం, బయోమెట్రిక్లో లోపాలు, హాజరులో అవకతవకలు, అధ్యాపకుల ఖాళీలు ఉన్నట్టు ఎన్ఎంసీ తనిఖీల్లో బయటపడింది. దీంతో ఆయా కళాశాలల గుర్తింపు రద్దుకు ఎన్ఎంసీ నిర్ణయం తీసుకున్నది. ఎన్ఎంసీ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు కళాశాలలకు 30 రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ ఎన్ఎంసీ వద్ద అప్పీల్ తిరస్కరణకు గురైతే కేంద్ర ఆరోగ్య శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రమాణాలు పాటించని కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని గతేడాది డిసెంబర్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ హెచ్చరించారు.