పన్నా, సెప్టెంబర్ 30: మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ఖండ్ రీజియన్లోని పన్నాలో వజ్రాల పంట పండింది. అక్కడి కూలీలను అదృష్టం వరించింది. వేర్వేరు గనుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 15 వజ్రాలు దొరికాయి . వీటి బరువు 35.86 క్యారెట్లు. వీటిని వేలం వేస్తే దాదాపు రూ. కోటి వస్తాయని గనుల శాఖ అధికారి వెల్లడించారు. దీంతో రాత్రికి రాత్రే కూలీలు లక్షాధికారులైపోయారు. కల్లు సోంకర్ అనే కూలీకి ఏకంగా 6.81 క్యారెట్ల వజ్రం దొరికింది. రాజేశ్ జైన్ అనే కూలీ 2.28క్యారెట్లు, రాహుల్ అగర్వాల్ 4.32, రాజ్బాయ్ రాయ్క్వార్ 1.77 క్యారెట్ల వజ్రాన్ని వెలికితీసినట్టు అధికారి వెల్లడించారు. ఇందులో దాదాపు పది వజ్రాలు క్రిష్ణకల్యాణ్పూర్ పాటి గనిలో దొరికినట్టు చెప్పారు. వీరందరిలో డుక్మాన్ అహిర్వార్ చాలా అదృష్టవంతుడని, అతడికి 2.46 క్యారెట్ల బరువున్న ఆరు వజ్రాలు దొరికాయని వివరించారు. ఈ వజ్రాలన్నింటినీ డైమండ్ ఆఫీస్లో డిపాజిట్ చేశామని, అక్టోబర్ 18న వేలం వేస్తామని అధికారి ప్రకటించారు. ముడి వజ్రాలను వేలం వేస్తామని, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు పోనూ మిగిలిన సొమ్మును వాటిని సేకరించినవారికి అందజేస్తామని అధికారి తెలిపారు.