Republic Day | న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే కర్తవ్య్ పథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వేడుకలకు 77 వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీని 28 జోన్లుగా విభజించామని చెప్పారు. ఈ జోన్లలో పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఇక హెల్ప్ డెస్కులు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే అతిథులు సమయానికి చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. చెక్ పాయింట్ల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తామన్నారు.
సోమవారం అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. సంఘ విద్రోహ శక్తుల నుంచి అనేక బెదిరింపులు వచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఇక రిపబ్లిక్ వేడుకలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.