విజయనగరం: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయనగరం దవాఖానలకు తరలించారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిప్రదికన కొనసాగుతున్నాయి. పట్టాలపై కుప్పులగా పడిఉన్న రైలు బోగీలను ప్రొక్లెయిన్, క్రేన్ల సహాయంతో సిబ్బంది తొలగిస్తున్నారు. విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మరో నాలుగు గంటల్లో అంతా క్లియర్ చేస్తామని, రైళ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు.
విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఒకే ట్రాక్పై ఆగిఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఓవర్ హెడ్ విద్యుత్తు వైర్లు తెగిపోవడంతో పట్టాలపై ఆగిపోయింది. ఆగి ఉన్న ఈ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొన్నది. దీంతో రాయగడ ప్యాసింజర్ రైలు చివరి మూడు భోగీలు పట్టాలు తప్పాయి. అవి ఎదురుగా వస్తున్న గూడ్స్ ఇంజిన్ను ఢీకొట్టాయి. దీంతో ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొన్నది. ఈ నెల మొదటివారంలో ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటన మాదిరిగా ఇదీ జరగడం విశేషం.
పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనా ప్రకారం మృతుల సంఖ్య 40-50 వరకు ఉంటుందని సమాచారం. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థికసాయం ప్రకటించింది.
ప్రమాదం నేపథ్యంలో అదే రూట్లో వెళ్లాల్సిన 12 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 15 రైళ్లను దారి మళ్లించగా, ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామన్నారు. రద్దయిన వాటిలో కోర్బా-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు ఉన్నాయి.