Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్లో కుంభ వృష్టి కురుస్తున్నది. ఒక్కసారిగా గుహ పరిసరాల్లోకి వరద వచ్చి పడటంతో అందులో చిక్కుకున్న 16 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 40 మందికి పైగా గల్లంతై ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించామని జమ్ముకశ్మీర్ ఐజీపీ చెప్పారు. బురదలో చిక్కుకుని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ముగ్గురు యాత్రికులను సహాయ సిబ్బంది వెలికి తీసి, హెలికాప్టర్లో దవాఖానకు తరలించారు. కుంభవృష్టి వర్షం దాటికి 25 టెంట్లు కొట్టుకుపోయాయి.
గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆరు ఆర్మీ హెలికాప్టర్లలో సహాయ చర్యలు చేపట్టారు. పది ఆర్మీ టీమ్లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు అమర్ నాథ్ యాత్ర నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. కేంద్ర, జమ్ముకశ్మీర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో అమిత్ షా మాట్లాడారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా అధికారులతో సంప్రదించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.