భోపాల్/ముంబయి, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరో 15 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు నిర్వహణ బలగాల (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా రక్షించినట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఉదయం 7.30 గంటలకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో స్థానిక ఖల్ఘట్, తిగారి బ్రిడ్జికి చుట్టిన ఇనుపకంచెను బస్సు తాకడంతో నర్మదా నదిలోకి పడిపోయినట్టు తెలిపారు. ఘటనలో గాయపడిన వారికి స్థానిక దవాఖానలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించామని, మరణించిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారని మధ్యప్రదేశ్ ఇండోర్ జోన్ ఐజీ రాకేశ్ గుప్తా తెలిపారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందిస్తూ మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.